ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. మూడు నెలల లోపు ఎమ్మెల్యేల అనర్హతపై తుది నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధిస్తూ తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు, ఏండ్ల తరబడి ఫిరాయింపుల పిటిషన్లు పెండింగ్లో ఉంచడాన్ని తప్పుబట్టింది.పార్టీ మారిన ఎమ్మెల్యేలకు న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. అలాగే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ స్పీకర్ అధికారాలపై తుదితీర్పు ఇచ్చే హక్కు తమకుందని స్పష్టం చేసింది.2023 నవంబర్లో కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్, పాడి కౌశిక్ రెడ్డి లు వేసిన పిటిషన్లపై మూడు రోజులపాటు వాదనలు జరిగాయి. ఈ మేరకు ఏప్రిల్ 3న తుది తీర్పును రిజర్వులో ఉంచిన ధర్మాసనం, ఇప్పుడు స్పష్టమైన ఆదేశాలు వెలువరించింది.అంతే కాకుండా, పార్లమెంటే పార్టీ ఫిరాయింపు అంశంపై స్పష్టమైన చట్టాన్ని రూపొందించాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది. అక్టోబర్ 31వ తేదీలోపు స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో, తాజా తీర్పు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Admin
Aakanksha News