Tuesday, 28 July 2026 09:33:39 AM

వైసీపీ గుర్తింపును రద్దు చేయాలి...

మాజీ మంత్రి జవహర్ డిమాండ్

Date : 12 February 2024 06:17 PM Views : 322

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల అక్రమాలకు కారణమైన వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని మాజీ మంత్రి జవహర్ అన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ నేతలు గురుమూర్తి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను రాబోయే ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జగన్ గతంలో నోట్ల కుంభకోణం చేశారని.. ఇప్పుడు ఓట్ల కుంభకోణం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలను ఏ విధంగా చేయాలనే దానిపై తిరుపతి ఉప ఎన్నికలు ఓ మోడల్‌గా నిలుస్తాయని విమర్శించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 వేల ఓటర్ కార్డులను వైసీపీ నేతలు డౌన్ లోడ్ చేశారన్నారు. గిరీషా, చంద్రమౌళీశ్వర రెడ్డి లాంటి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారంటే అది వారి కోసం కాదని.. వారి వెనుక వైసీపీ నేతలు ఉండే ఈ పని చేయించారని చెప్పారు.తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీని గెలిపించడానికే అధికారిక లాగిన్ నుంచి ఓటర్ కార్డులను డౌన్ లోడ్ చేశారన్నారు. ఆ ఎన్నికల్లో గెలుపొందిన గురుమూర్తి మళ్లీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారన్నారు. గురుమూర్తి కూడా ఓ తోలు బొమ్మ అని ఎద్దేవా చేశారు. తెరవెనుక ఉండే తోలు బొమ్మలను ఆడించే మనుషులు పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, భూమన, సజ్జల వంటి నేతలని విమర్శించారు. సీఈఓ కార్యాలయంలోనే జగన్ మనుషులున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల తరహా అక్రమాలు ఇంకెన్ని చోట్ల జరిగి ఉంటాయి..? అని ప్రశ్నించారు. ఇంకెంత మంది ఎన్నికల అధికారుల లాగిన్లు జగన్ చేతిలో ఉన్నాయోననే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడిన గురుమూర్తి, పెద్దిరెడ్డి, భూమన, చెవిరెడ్డి వంటి వైసీపీ నేతలను ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హులుగా ప్రకటించాలని జవహర్ డిమాండ్ చేశారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :