ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / జగిత్యాల జిల్లా : జాతీయ ఆరోగ్య మిషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉత్తమ వైద్య సేవలు, శుచి, శుభ్రత ప్రమాణాల కోసం అందించే కాయకల్ప అవార్డు కు ఈసారి కోరుట్ల ప్రభుత్వ వంద పడకల ఏరియా ఆసుపత్రి ఎంపికైంది.2024–25 సంవత్సరానికి గాను శుచి, శుభ్రత అంశాల్లో 86.92 శాతం స్కోరు సాధించి రాష్ట్రవ్యాప్తంగా 11వ స్థానంలో నిలిచింది. ఆసుపత్రిలోని పారిశుధ్యం, బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ, రోగులకు, అటెండెంట్లకు అందిస్తున్న సదుపాయాలు, ఇన్ఫెక్షన్ నియంత్రణకు తీసుకున్న చర్యలు, సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ వంటి అంశాల ఆధారంగా ఈ ఎంపిక జరిగిందని జాతీయ ఆరోగ్య మిషన్ బృందం పేర్కొంది.ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీతరాణి హర్షం వ్యక్తం చేస్తూ, “ఇది కోరుట్ల ఆసుపత్రికి గర్వకారణమైందని, మెరుగైన వైద్యసేవలందించేందుకు ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహాన్నిస్తోంది” అని తెలిపారు. కాయకల్ప అవార్డుతోపాటు రూ. లక్ష నగదు పారితోషికం, ప్రశంసాపత్రం ఆసుపత్రికి అందనుంది.
Admin
Aakanksha News