ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : సింగూర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురిసిన విస్తార వర్షాల కారణంగా ప్రాజెక్టు జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారుల ప్రకటన ప్రకారం, గురువారం ఉదయం 11:25 గంటల సమయానికి ప్రాజెక్టు వద్దకి సుమారు 20,000 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. దీంతో, ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుదలను 20,000 క్యూసెక్కులకు పెంచినట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో, ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలు, రైతులు, మత్స్యకారులు, పశువుల కాపరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు మంజీరా నది తీరప్రాంతాల్లోకి వెళ్లరాదని, పశువులు, గొర్రెలను నీటిమట్టం పెరుగుతున్న ప్రాంతాలకు దూరంగా తరలించాలనీ హెచ్చరిక జారీ చేశారు.ప్రాజెక్టు ప్రాంతంలో నీటి మట్టం వేగంగా పెరుగుతుండగా, సంబంధిత శాఖలు నిత్యం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. వరద ఉద్ధృతి కొనసాగే అవకాశమున్నందున రాత్రి వేళల్లో ఎవరూ నది ప్రాంతాల వైపు వెళ్లవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. స్థానిక రెవెన్యూ, పోలీసులు, సింగూర్ ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో తగిన జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. గ్రామ ప్రజలు అధికారుల సూచనలను పాటించాలంటూ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.
Admin
Aakanksha News