ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : బీహార్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఆ రాష్ట్రంలో ఈ ఏడాది ఆఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ అధికార ఎన్డీఏ నేతలకు, ప్రతిపక్ష ఆర్జేడీ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే రెండు వైపుల నుంచి ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ , మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరాయి. తాజాగా సీఎం నితీశ్ కుమార్పై తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీశ్ను తాను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశానంటూ వ్యాఖ్యానించారు.ఇటీవల బీహార్ అసెంబ్లీలో నితీశ్ సర్కారు బీహార్కు ఏం చేసిందని తేజస్వి ప్రశ్నిస్తే.. నీ తండ్రిని నాయకుడిని చేసిందే నేనని నితీశ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తేజస్వి యాదవ్ బుధవారం స్పందించారు. జేడీ(యూ) చీఫ్ నితీశ్కు రెండుసార్లు రాష్ట్రంలో అత్యున్నత పదవిని దక్కించుకోవడానికి తానే సాయం చేసినట్లు చెప్పారు. చిక్కుల్లో పడ్డ ఆయన పార్టీని తానే ఆదుకున్నానని వ్యాఖ్యానించారు.
Admin
Aakanksha News