ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / యాదాద్రి భువనగిరి జిల్లా : రైతులకు మదర్ డైరీ బాకీ పడిన పాల బిల్లులను తక్షణమే చెల్లించాలని... లేని పక్షంలో మూడు రోజుల్లో మదర్ డైరీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రాజాపేట పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్ సందిల భాస్కర్ గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన రాజాపేటలో మాట్లాడుతూ పెండింగ్ బిల్లుల చెల్లింపు తర్వాతనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో గతంలో గెలిచిన ఆరుగురు డైరెక్టర్ల కృషి శూన్యమన్నారు. సకాలంలో పాల బిల్లులు ఇప్పిస్తామని ఎన్నికల్లో హమీ ఇచ్చి ,ఆ తర్వాత నిస్సహాయులుగా మారిన డైరెక్టర్లు తమ తమ పదవులకు రాజీనామా చేయడం మంచిదన్నారు. ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి పెండింగ్ పాల బిల్లులు వచ్చేలా కృషి చేయాలని డైరెక్టర్లకు సూచించారు. ప్రభుత్వం విజయ డైరీ కి ఇస్తున్న మాదిరిగా మదర్ డైరీ కి కూడా డబ్బులు సకాలంలో ఇస్తే ఈ దుస్థితి రైతులకు పట్టేది కాదన్నారు. రెండు జిల్లాలలోని ప్రభుత్వ హాస్టల్లలో మదర్ డైరీ పాలకు బదులు విజయ డైరీ పాలు వచ్చేలా ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ప్రతినిత్యం భారీ పరిమాణంలో నెయ్యి అవసరం పడుతుందని.. సరఫరా ఆర్డర్ కాపీ మాత్రం సాధించ లేకపోయారని సందిల భాస్కర్ గౌడ్ విమర్శించారు.ఈ మీడియా సమావేశంలో చైర్మన్ లు పోసుకొండ దశరథ, నీల బిక్షపతి, నీల రాజు, పోసు గొండ మధు, రైతు సంఘం నాయకులు పులి చంద్రమౌళి, యామ జగదీష్, బాబు, కాకల ఐలయ్య పాల్గొన్నారు
Admin
Aakanksha News