ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ హాట్టాపిక్గా మారింది ఎమ్మెల్సీ కవిత వ్యవహారం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేసిన నేపథ్యంలో, ఇప్పుడు కవిత స్వయంగా ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన మరికాసేపట్లో వెలువడనుందని సమాచారం. అయితే కవిత భవిష్యత్తు రాజకీయాలపై రాష్ట్రంలో ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. పార్టీ నోటీసులు, ఆరోపణలు, సస్పెన్షన్ నిర్ణయం ఒకవైపు ఉండగా, కవిత స్వయంగా మరో ముందడుగు వేసి రాజీనామా చేయాలనుకోవడం రాజకీయపరంగా కీలకంగా భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ఫిర్యాదులు చేయకముందే ఆమె రాజీనామా చేసేందుకు తీసుకున్న నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి.ఈ పరిణామాలపై కవిత జాగృతి కార్యాలయంలో తన అనుచరులు, కీలక నాయకులతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తుంది.జాగృతి కార్యకర్తలు, విశ్వాసపాత్రులైన నాయకులు ఇప్పటికే హైదరాబాద్ జాగృతి కార్యాలయానికి చేరుకుంటున్నారు.భవిష్యత్లో ఏ దిశగా కదలాలి? పార్టీ నుండి పూర్తిగా దూరమవ్వాలా? లేక కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలా? అనే అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కవిత అంశం తీవ్రంగా మార్మోగుతోంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం, మరోవైపు బీజేపీ నేతలు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్న వేళ, బీఆర్ఎస్ పార్టీ కూడా ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం కవితకు షాక్గా మారింది. దీనికి ప్రతిగా ఆమె స్వయంగా రాజీనామా చేయడం ద్వారా తానేమీ పదవుల కోసం పార్టీతో కట్టుబడి లేనని, తనకంటూ ప్రత్యేక మార్గం ఎంచుకునే సిద్దతలో ఉన్నారని సంకేతాలు ఇస్తున్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.కవిత రాజీనామా తర్వాత ఏ రాజకీయ శక్తుల దిశగా అడుగులు వేస్తారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. జాగృతి అనే వేదికను ఉపయోగించి కొత్త రాజకీయ వైఖరి ఎంచుకుంటారా? లేక ఇప్పటికే ఉన్న జాతీయ రాజకీయ పార్టీలతో సఖ్యత చూపుతారా? అన్నది ఆసక్తిగా మారింది.మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి కవిత తీసుకోబోయే నిర్ణయం పెద్ద దెబ్బ అవుతుందని పలువురు రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత కవితపై ఒత్తిడి పెరుగుతుందనుకున్న వేళ, ఆమె స్వయంగా రాజీనామా చేయడం బీఆర్ఎస్కు ఎదురుదెబ్బగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు.హైదరాబాద్లోని జాగృతి కార్యాలయం వద్ద ఇప్పటికే మీడియా రద్దీ పెరిగింది. ఎప్పటికప్పుడు కవిత ప్రకటించే ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం కలకలం రేపడం ఖాయం అని భావిస్తున్నారు.
Admin
Aakanksha News