Tuesday, 28 July 2026 11:14:40 AM

శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప భక్తుల బస్సును కారు ఢీకొన్న కారు...

పెళ్లయిన 15 రోజులకే రోడ్డు ప్రమాదంలో నవ వధూవరులు దుర్మరణం

Date : 15 December 2024 06:44 PM Views : 581

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / ఆకాంక్ష డెస్క్ : కేరళలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లయిన 15 రోజులకే రోడ్డు ప్రమాదంలో నవ వధూవరులు దుర్మరణం చెందారు. శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప భక్తుల బస్సును కారు ఢీకొట్టడంతో నవ దంపతులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.కేరళలోని పథానంతిట్టకు చెందిన అను, నిఖిల్‌కు 15 రోజుల కిందట వివాహమైంది. పెళ్లి తర్వాత హనీమూన్‌కు మలేసియాకు వెళ్లి ఇవాళ తిరిగి కేరళకు వచ్చారు. ఈ క్రమంలో తిరువనంతపురంలో కొత్త దంపతులను రిసీవ్‌ చేసుకోవడానికి నిఖిల్‌ తండ్రి మథాయ్‌ ఈపన్‌, అను తండ్రి జార్జ్‌ బిజులు వెళ్లారు. వారంతా కారులో బయల్దేరి సొంతూరికి వెళ్తుండగా ఆదివారం ఉదయం 4.05 గంటల ప్రాంతంలో పనలూరు-మువట్టుపుజ రహదారిపై పథానంతిట్ట జిల్లా మురింజకల్‌ వద్ద ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన అయ్యప్ప భక్తులు వెళ్తున్న బస్సును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నిఖిల్‌, జార్జ్‌ బిజు, ఈపన్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అను మృతి చెందింది.ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ సహా పలువురు అయ్యప్ప భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జవ్వడంతో హైడ్రాలిక్‌ సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. కారు డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :