ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / నాగర్కర్నూల్ జిల్లా : నాగర్కర్నూల్ జిల్లాలోని లింగాల మండలం చెన్నంపల్లి గ్రామంలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. కసాయి తల్లిగా మారిన మహిళ తన ఏడేళ్ల చిన్నారిని నిర్దాక్షిణ్యంగా హత్య చేసింది. చెన్నంపల్లి గ్రామానికి చెందిన ఎల్లమ్మ అనే మహిళ తన కూతురు నందిని (7) ను గొంతు నులిమి చంపిన అనంతరం ఆమె మృతదేహాన్ని గ్రామ శివారులోని నీటి గుంటలో పడేసింది.ఈ దారుణానికి పాల్పడిన ఎల్లమ్మ గతంలో తన భర్తను కూడా హత్య చేసిన మహిళగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగా ఆమె భర్తను హత్య చేసిన తర్వాత జైలు శిక్ష అనుభవించింది. ఇప్పుడు మళ్లీ అదే దారుణానికి దిగిన ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఎల్లమ్మపై హత్య కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఆమెకు మానసిక స్థితి సాధారణంగా లేదని కొందరు గ్రామస్థులు చెబుతుండగా, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.చిన్నారిని హత్య చేసిన ఘటనపై గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. పాపను కాపాడాల్సిన తల్లే కడతేర్చడం పట్ల ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Admin
Aakanksha News