ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో దారుణ దారి దోపిడీ చోటుచేసుకుంది. నాగుసాన్పల్లి గ్రామానికి చెందిన బూసనేల్లి మానెమ్మ అనే మహిళకు చెందిన ఐదున్నర తులాల బంగారం పట్టపగలే చోరీకి గురైంది. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం పాపన్నపేట – కొత్తపల్లి రోడ్డుపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మానెమ్మ తన భర్త కిషన్తో కలిసి బంధువుల ఇంటి పండుగకు వెళ్తుండగా, కొత్తపల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎదురయ్యారు. వారు మాయమాటలు చెప్పి మానెమ్మ చేతుల్లోని బంగారు ఆభరణాలను సడలించుకుని ఉడాయించారని పోలీసులు వెల్లడించారు. బాధితురాలు తేరుకొని చూసేసరికి బంగారం అంతా మాయమైపోయింది. వెంటనే కన్నీరు మున్నీరై, కుటుంబ సభ్యుల సాయంతో పాపన్నపేట పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసింది.సుమారు ఆరు లక్షల రూపాయల విలువైన బంగారం చోరీకి గురైందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను టార్గెట్చేసి దోపిడీ చేస్తున్న సంఘటనలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సంఘటనపై పాపన్నపేట ఎస్.ఐ శ్రీనివాస్ గౌడ్ దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.స్థానికులు, మహిళలు ఈ ఘటనతో భయాందోళనలకు గురవుతున్నారు. బూసనేల్లి మానెమ్మ కన్నీటి మునిగిన పరిస్థితిని చూసి గ్రామస్థులు చలించిపోయారు. “పండుగకు వెళ్తూ ఇంత దురదృష్టం ఎదురవుతుందనుకోలేదు” అంటూ ఆమె కుటుంబ సభ్యులు వేదన వ్యక్తం చేశారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులను త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్.ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
Admin
Aakanksha News