ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : దీపావళి పండుగ రాకముందే నల్గొండలోని ఫైర్ ఆఫీసులో లంచపు టపాసులు పేలాయి. ఫైర్ డిపార్ట్మెంట్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల బారినపడ్డారు. వివరాల్లోకి వెళ్తే...నల్గొండ జిల్లా కేంద్రంలో ఫైర్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో సత్యనారాయణ రెడ్డి పేరుతో కొంతమంది వ్యాపారుల నుంచి పలు సందర్భాల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని ఏసీబీ అధికారులకు సమాచారం అందింది.దాంతో ఏసీబీ అధికారులు సన్నాహాలు చేసుకుని గురువారం ఉదయం సోదాలు చేపట్టారు. దీపావళి సందర్భంగా పట్టణంలో క్రాకర్స్ షాపులు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఒక షాపు నిర్వాహకుడి నుండి అనుమతి పత్రాల నిమిత్తం రూ.8 వేల లంచం కోరిన సత్యనారాయణ రెడ్డి, నిర్ణీత సమయానికి ఆ మొత్తాన్ని స్వీకరించే క్రమంలో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.ఆ సమయంలో ఏసీబీ అధికారులు అతని చేతులు, చొక్కా జేబులు, టేబుల్ పై లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫైర్ ఆఫీసులో అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయన్న వార్తతో స్థానిక ప్రజల్లో సంచలనం రేగింది. ప్రజల భద్రత కోసం పనిచేయాల్సిన ఫైర్ విభాగంలోనే అవినీతి మంటలు చెలరేగడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఏసీబీ అధికారులు ఘటనపై పూర్తి విచారణ ప్రారంభించారు. సత్యనారాయణ రెడ్డిని అదుపులోకి తీసుకుని నల్గొండ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. లంచం తీసుకున్న సాక్ష్యాలు బలంగా లభించడంతో అతనిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.దీనిపై ఏసీబీ వర్గాలు మాట్లాడుతూ...సాధారణ ప్రజల నుండి డబ్బులు వసూలు చేసే అధికారులపై ఎవరైనా సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు. మరోవైపు జిల్లా ప్రజలు ఈ ఘటనపై ‘‘దీపావళి ముందు లంచపు బాణాసంచా పేలింది’’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.ఈ ఘటనతో ఫైర్ డిపార్ట్మెంట్ ప్రతిష్టకు పెద్ద దెబ్బ తగిలింది. అధికార వర్గాలు సత్యనారాయణ రెడ్డిని సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం....
Admin
Aakanksha News