ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : వేములవాడ పట్టణంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. సిరిసిల్ల మాజీ కౌన్సిలర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి సిరిగిరి రమేష్(45)ను గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దారుణంగా హత్య చేశాడు. నాంపల్లి శివారులోని రహదారి పక్కన నిలిపి ఉంచిన తన కారులోనే రమేష్ హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు, సిరిసిల్లకు చెందిన రమేష్ గత కొంతకాలంగా వేములవాడ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తున్నాడు.వ్యాపార లావాదేవీలలో పాత విభేదాలు, వ్యక్తిగత విరోధాల కారణంగా ఈ దారుణానికి పాల్పడ్డారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో రమేష్ తన కారులో ఉన్నప్పుడు దుండగుడు మెడపై కత్తితో పొడవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనతో వేములవాడలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సిరిసిల్ల జిల్లా ఎస్పీ తెలిపారు.రమేష్ ఇటీవల వేములవాడలో కొత్తగా ఒక వెంచర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ వెంచర్ పనుల్లో ఉండగానే ఆయన దారుణ హత్యకు గురికావడం స్థానికులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వ్యాపార సంబంధాలే హత్యకు కారణమా? లేక ఇతర కారణాలున్నాయా అన్నదానిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Admin
Aakanksha News