ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ప్రజలను నమ్మించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేసారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘాటుగా విమర్శించారు. ఈపెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జనగామ గ్రామ శివారులోని గోదావరి నది ఇసుకలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలసి వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విన్నూత నిరసన తెలిపారు. అక్కడే కూర్చొని రైతులతో భోజనం చేసారు. అనంతరం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లు మాట్లాడుతూ... అబద్దపు హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, ప్రజలను, అన్ని వర్గాల వారిని ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. ఇటీవలి కాలంలో గోదావరి నది పూర్తి స్థాయిలో ఎడారిగా మారడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్న నీటిని విడుదల చేయకపోవడంతో గోదావరి నదిలోకి నీరు రావడం లేదని వెంటనే ఎల్లంపల్లి నుండి నీటిని విడుదల చేయడం ద్వారా సుందిళ్ల, అన్నారం, కన్నెపల్లి బ్యారేజీలు నిండుకుంటాయని దీంతో రైతులకు పూర్తి స్థాయిలో నీరు అందుతుందని అన్నారు. గతంలో గోదావరిలో నీరు ఉన్న సమయంలో రైతులు మోటార్ల ద్వారా నీటిని తీసుకునే వారని స్పష్టం చేసారు. పొలాలు కోతకు వచ్చిన సమయంలో గోదావరిలో చుక్క నీరు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రాజెక్టుల రిపేరు పేరుతో నీటిని వదలకుండా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో గోదావరి నదిలు నిండు కుండల ఉన్నాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో గోదావరి నదిలు ఎడారిగా మారుతున్నాయని విమర్శించారు. ఇప్పటికే హైడ్రా పేరుతో ఎంతో మంది పేద ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డున పడేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఖరి వాళ్ళ అన్ని వర్గాల ప్రజలు గోస పడుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎవరు అడగని పనులను చేస్తూ దుర్మార్గమైన పాలనా సాగిస్తున్నారని విమర్శించారు. ఎంత సేపు కేసీఆర్ ను బదనాం చేసే విధంగా మాట్లాడటం తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడటం లేదాని తెలిపారు.
Admin
Aakanksha News