ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : వీధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులపై జిల్లా కలెక్టర్ & స్పెషల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకున్నారు. రామగుండం నగర పాలక సంస్థ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) & కమిషనర్ జె. అరుణ శ్రీ వివరాలు వెల్లడించారు.డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. హనుమంత రావు నాయక్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన మొబైల్ అప్లికేషన్లో సకాలంలో డేటా అప్డేట్ చేయించడంలో పర్యవేక్షణ లోపం చూపడంతో పాటు, టి.యు.ఎఫ్.ఐ.డి.సి తదితర పథకాల కింద చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయించడంలో విఫలమయ్యారని కమిషనర్ తెలిపారు. ఈ నిర్లక్ష్యం నేపథ్యంలో ఆయన సేవలను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ, ఆయన స్థానంలో కొత్త డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను నియమించవలసిందిగా పబ్లిక్ హెల్త్ & మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్-ఇన్-చీఫ్ను కోరినట్లు తెలిపారు.అలాగే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపట్టవలసిన పారిశుద్ధ్య కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయడంలో విఫలమైన సానిటరీ ఇన్స్పెక్టర్ డి. కిరణ్పై కూడా చర్యలు తీసుకున్నారు. తన పరిధిలోని డివిజన్లలో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగా ఆయన సేవలను కూడా ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ, ఆయన స్థానంలో కొత్త సానిటరీ ఇన్స్పెక్టర్ను నియమించాలని సి & డి ఎం ఎకు అభ్యర్థించినట్లు జె. అరుణ శ్రీ తెలిపారు. కమిషనర్ స్పష్టం చేస్తూ, ప్రజా సేవలలో నిర్లక్ష్యం, గడువులు పాటించకపోవడం, పథకాల అమలులో అలసత్వం ప్రదర్శించే అధికారులపై ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం చూపబోమని హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పారు.
Admin
Aakanksha News