ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : మమ్మల్ని గోస పెట్టకండి... మా కుటుంబాలను రోడ్డున పడేయకండి అంటూ మొగిలిపాడు రైతులు మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ... గతంలో ప్లాంటు నిర్మించే సమయంలో ఎన్టీపీసీ యాజమాన్యం స్థానికంగా ఉన్న రైతులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వారికి నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు. భూములు తీసుకొని ప్లాంట్ ఏర్పాటు చేసిన అనంతరం నష్టపరిహారం కోసం అడిగితే యాజమాన్యమే మాపై కోర్టులో కేసు వేసిందని ఇది ఎక్కడి న్యాయం అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్టీపీసీ యాజమాన్యం మాపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని వారన్నారు. మళ్లీ ప్లాంట్ నిర్మాణం కోసం భూములు తీసుకొని మాపై కేసులు వేసి వేధింపులకు గురిచేయడానికా అని రైతులు ప్రశ్నించారు. ఇప్పటికైనా విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు పూర్తి స్తాయిలో నష్టపరిహారాన్ని చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.
Reporter
Aakanksha News