ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : కార్మికుల నిండుకొండగా నిలిచిన రామగుండం ప్రాంతానికి ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం ఎంతో కీలకమైందని, పార్లమెంటులో ఘనమెత్తి ఈఎస్ఐ ఆసుపత్రిని సాధించుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్థల పరిశీలన కోసం వచ్చిన సమయంలో, అధికారుల నిర్లక్ష్యం అవమానకర ప్రవర్తన తీవ్ర విమర్శలకు దారి తీసిందని సినీయర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుబాసి మల్లేష్ అన్నారు. ప్రజా ప్రతినిధి గౌరవాన్ని ధ్వంసం చేస్తూ అధికారుల ప్రవర్తించిన తీరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దళిత వర్గాలలో తీవ్ర ఆగ్రహాన్ని రగల్చిందని పేర్కొన్నారు.రామగుండం కార్మిక ప్రాంతంలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం వలన లక్షలాది కార్మికులు, కూలీలు, కుటుంబాలు ఆరోగ్య పరిరక్షణలో పెద్ద మేలును పొందబోతున్న పరిస్థితుల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తెచ్చిన ఎంపీని అవమానించడం ప్రజాస్వామ్యానికి అవమానం అని నాయకులు మండిపడ్డారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ, కాక కుటుంబం సేవలు ప్రజలకు స్ఫూర్తి అని పేర్కొంటూ, అలాంటి నాయకునికి కుటుంబం నుండి వచ్చిన తనయునికి జరిగిన అవమానం ఒప్పుకోలేనిదని తెలిపారు.పార్లమెంటు పరిధిలోని దళితులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఈ సంఘటనను తట్టుకోలేక బాధ, ఆగ్రహంతో ఉన్నారని దుబాసి మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు.దళిత గౌరవానికి నెపం తగిలే విధంగా వ్యవహరించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో శ్రమించి విజయం సాధించిన నాయకుని అవమానించే అధికారులకు కాంగ్రెస్ లో చోటు లేదని మల్లేష్ ఖండించారు. అధికారుల ఇలాంటి దుశ్చర్యల వలన దళితులు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, ప్రభుత్వానికి స్పష్టంగా సందేశం పంపించారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తోన్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. ఎంపీ వంశీకృష్ణకు మరల అవమానం జరిగితే తిరుగుబాటు తప్పదని, దళితుల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని ఆయన తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. దళితుల గౌరవం, ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజా ప్రతినిధుల విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని, పార్టీ బలోపేతం కోసం తక్షణ చర్యలు అవసరం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు దుబాసి మల్లేష్ ఒక్క ప్రకటనలో హెచ్చరించారు.
Admin
Aakanksha News