ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : గోదావరి తల్లి కన్నీటి గోసను వివరిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేయడానికి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమ్మక్క-సారక్క గోదావరి నది నుండి ఎర్రవెల్లి వరకు 180 కిలో మీటర్ల మహా పాదయాత్రను రామగుండం నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ చేపట్టారు. కో ఆర్డినేటర్ బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో పాదయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. అయితే మొదటగా గోదావరిఖని జవహర్లాల్ నగర్ నెహ్రూ స్టేడియం వద్ద ఉన్న దుర్గ మాత, జనగామ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చౌరస్తాలోని అమరవీరుల స్మారక స్తూపం, రాజేశ్ థియేటర్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే, మున్సిపల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి సమ్మక్క-సారలమ్మ గద్దెలకు ప్రత్యేక మొక్కులు చెల్లించి గోదావరి తీరంలో కొలువైన మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పాదయాత్రను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంబించారు. 6 రోజుల పాటు ఈ పాదయాత్ర సాగనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గోదావరి జలాలు నిండు కుండల మారాయని కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గోదావరి ఎండిపోయి నీరు లేక అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కన్నీటి బాధలు, రైతన్నల కన్నీటి గాధలను ఈ పాదయాత్ర ద్వారా ఎర్రవల్లి వద్దకు వెళ్లి తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి వివరించనునన్నట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు.పోరాటాల పురిటి గడ్డ గోదావరిఖని నుండే ఆనాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయిందని, మళ్ళీ నీటి కోసం మరో ఉద్యమం ప్రారంభం అవుతుందాన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నీళ్లు నిధులు నియామకాలు మీద పోరాటాలు చేసి కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లపాటు ప్రగతిని సాధించుకున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో నీళ్ల కోసం మిషన్ కాకతీయ నుండి కాలేశ్వరం ప్రాజెక్టు వరకు పంట పొలాలకు నీళ్లు అందించి తెలంగాణను సస్యశ్యామలంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. కేసీఆర్ పై తప్పుడు ప్రచారం చేస్తూ దొంగ మాటలు అబద్ధపు ప్రచారాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మళ్ళీ ఆనాటి నీటి సమస్యను తీసుకువచ్చిందని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం ఇలాంటి చర్యల అనుమానుకొని గోదావరి కి నీటి కల తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
Admin
Aakanksha News