ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సామాజిక సేవకుడు, పెద్దపల్లి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీ డబ్ల్యూ సీ) సభ్యులు, రాష్ట్ర చేయూత ఫౌండేషన్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ వ్యవస్థాపకుడు, యోగా గురువు నీలం ఐలయ్య(48) శుక్రవారం మృతి చెందాడు. ఆయన మృతిపట్ల విషాదంలో కూడా ఐలయ్య నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేసి ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే... గోదావరిఖని మార్కండేయ కాలనీ చెందిన ఐలయ్య, జిల్లా సీ డబ్ల్యూ సీ లో సభ్యుడు గా వ్యవహరిస్తున్నారు. ఐలయ్య గత ఇరవై ఏళ్లుగా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఐలయ్యకు రెండు కిడ్నీలు పాడవడంతో 2005లో ఐలయ్యకు ఆయన తల్లి రాధమ్మ ఒక కిడ్నీ దానం చేసింది. అప్పటినుంచి ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉంటూనే.. సామాజిక కార్యక్రమంల్లో చురుకుగా ఉంటున్న ఐలయ్య, బాలల సంక్షేమం సంరక్షణ కోసం కృషి చేస్తున్నాడు. మరోవైపు అందరికీ ఆరోగ్యాన్ని పంచడానికి యోగా శిక్షణ పొంది, పలువురికి యోగా ఆసనాలు నేర్పిస్తున్నాడు. ఇంకో వైపు ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించున్న వారికి అండగా ఉండేందుకు చేయూత ఫౌండేషన్ స్థాపించాడు. జిల్లాలో అందరికీ సుపరిచితుడైన ఐలయ్య ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఈ నేపధ్యంలోనే శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురైన ఐలయ్యను, హుటాహుటిన గోదావరిఖని జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఐలయ్య అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఐలయ్య నేత్రాలను దానం చేస్తే, ఇద్దరు అంధులకు చూపును ప్రసాధించవచ్చని కుటుంబ సభ్యులకు సదాశయ ఫౌండేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కే.ఎస్.వాసు సూచన మేరకు ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ అవగాహన కల్పించారు. దుఃఖంలో కూడా ఐలయ్య చూపు సజీవంగా ఉంచేందుకు తల్లి తండ్రులు మల్లయ్య, రాధమ్మ, భార్య సుధారాణి తోపాటు కూతురు, కుమారుడు దానం చేయడానికి ముందుకు వచ్చారు. మృతుని నేత్రాలను టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సేకరించి హైదరాబాద్ తరలించారు. బుధవారం సాయంత్రం ఐలయ్య అంత్యక్రియలను వారి స్వగ్రామం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఘనపురం గ్రామంలో నిర్వహించారు. ఐలయ్య మృతిపట్ల సదాశయం ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, గౌరవ అధ్యక్షుడు సానా రామకృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారులు నూక రమేష్, కార్యదర్శి భీస్మాచారి, ప్రచార కార్యదర్శి కే.ఎస్.వాసు, జిల్లా సీ ఎల్ సీ జిల్లా చైర్మెన్ శ్రీధర్, బీజేపీ నాయకుడు పిడుగు కృష్ణ, రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షులు పి.మల్లికార్జున్, అడ్వకేట్ సత్యం, పీజీ కాలేజీ వాకర్స్ తదితరులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నేత్రదానం చేసి ఆదర్శంగా నిలిచిన నేత్రదాత కుటుంబాన్ని అభినందించారు.
Admin
Aakanksha News