ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం (ఐ ఎఫ్ టీ యు) కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ.కృష్ణ మాట్లాడుతూ.. సింగరేణిలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ అనుసరిస్తున్న విధానాలు కార్మికులకు శాపంగా మారుతు న్నాయనీ విజిలెన్స్ కు వెళ్లిన కేసులు ఎలాంటి పరిష్కారానికి నోచుకోక సంవత్సరాల తరబడి కార్మికులు మానసిక శోభ అనుభవిస్తున్నారనీ అన్నారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ పారదర్శకంగా నిజాయితీగా జవాబుదారి తనంగా లేకపోవడం ఆక్షేపించాల్సిన విషయం అని అన్నారు. కార్మికుల వారసులు ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ రికార్డులలో జరిగిన పొరపాట్లను ఆసరా చేసుకుని వారిని అనేక రకాలుగా వేధిస్తున్నారనీ అన్నారు. కార్మికులు విజిలెన్స్ కు పోయిన కేసుల విషయమై ఎవరిని సంప్రదించాలో దిక్కుతోచని పరిస్థితి అని తెలిపారు. జనరల్ మేనేజర్స్ ని అడిగిన పర్సనల్ డిపార్ట్మెంట్స్ అడిగిన మాకు సంబంధం లేదని విజిలెన్స్ వాళ్ళకే అన్నీ తెలుసు వారిని కలవమని దొంగ తిరుగుడు జవాబిస్తున్న పరిస్థితి నెలకొంటుందన్నారు. కార్మికులు కార్మిక సంఘాలు విజిలెన్స్ అధికారులను కలవడానికి ప్రయత్నించిన వారి నుండి సమాచారం సేకరించడానికి ప్రయత్నించిన వారు స్పందించకపోగా నిర్లక్ష్యమైన సమాధానమిస్తున్నారనీ పేర్కొన్నారు. విజిలెన్స్ అనేటువంటిది ఒక మాఫియా లాగా పనిచేస్తుందనీ దీనిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీంట్లో పనిచేసే ఉన్నతాధికారులంతా వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేసే వారే అని స్పష్టం చేసారు. ఇది స్వతంత్ర సంస్థ కాదని దీనికి జనరల్ మేనేజర్ బాధ్యతలు చూస్తున్నప్పటికీ విజిలెన్స్ కి వెళ్లిన కేసులను వాటి పురోగతిని కార్మిక కుటుంబాలకు, యూనియన్ కు తెరపాల్సిన బాధ్యత ఉందనీ అన్నారు. ఇదే విధానం విజిలెన్స్ కొనసాగించినట్టయితే కార్మికులు తీసుకునే నిర్ణయాలకు సింగరేణి యజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.కార్మికుల పిల్లల ఓపికకు పరీక్ష పెట్టకుండా కేసుల పురోగతిని తెలిపే బాధ్యతను ఒక సెల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేసుల పురోగతిపై బాధితులకు వివరించడానికి వారికి మనోధైర్యం కల్పించడానికి సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకోవాలని గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం(ఐ ఎఫ్ టీ యు) యజమాన్యాన్ని డిమాండ్ చేస్తుందన్నారు.విజిలెన్స్ డిపార్ట్మెంట్ పై కార్మికుల పిల్లలు చేస్తున్న నిరసనలను మేము పూర్తిగా బలపరుస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న కార్మికులు కార్మిక సంఘాలు విజిలెన్స్ పై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐ ఎఫ్ టి యు నాయకులు ఈ నరేష్, ఐ రాజేశం,ఎం కొమరయ్య, కొండ్ర మొగిలి, అఫ్జల్. తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News