ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : సింగరేణి కార్మికులకు బోనస్ ఇస్తానని చెప్పి మూడు రంగుల జెండా బోగస్ చేసిందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొని మాట్లాడుతూ... తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం గుర్తింపు యూనియన్ గా ఉన్న సమయంలో ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు చేసిందని అన్నారు. అలాగే దసరాకు కార్మికులకు ఇచ్చే బోనస్ విషయంలో రాజీ లేకుండా కార్మికులకు చెల్లించాల్సిన మొత్తం బోనసులను చెల్లించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికే దక్కుతుందన్నారు. అంతేకాకుండా పదవిలో ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా సింగరేణి కార్మికులు సంతోషంగా ఉండాలని కోరుకునేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని అన్నారు. ఇప్పటికే సింగరేణిలో మూడు రంగుల జెండా కార్మికులకు మూడు నామాలు పెడుతుందని విమర్శించారు. అసలు సింగరేణి ఆగం చేసిందే ఎర్రజెండా పార్టీ అని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని గెలిపించుకోవాలని యూనియన్ లో యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇచ్చి కొత్త వారికి అవకాశం కల్పించాలన్నారు. సింగరేణి కాల్ ఇండియా మెడలు వంచి ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే అని తెలిపారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. ఆనాడు తెలంగాణ ఉద్యమం సమయంలో సింగరేణి కార్మికులు చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో సింగరేణి ప్రైవేట్ పరం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని విమర్శించారు. అలాగే సింగరేణిలో వచ్చిన లాభాల వాటాను కార్మికులకు చెల్లించకుండా ప్రభుత్వం మోసం చేసిందని కవిత ఆరోపించారు.
Admin
Aakanksha News