ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : మంచిర్యాల జాతీయ రహదారి సి ఎన్ జి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ మంథని మండలం వేం పాడులో జరుగుతున్న జాతీయ రహదారి పనులతో పాటు పుట్ట పాక, మంథని వ్యవసాయ మార్కెట్ యార్డ్, ఏక్లాస్ పూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, మంథని పట్టణంలోని పాత పాల కేంద్రంలో కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ - మంచిర్యాల జాతీయ రహదారి సీ ఎన్ జి పనులను వేగవంతం చేసి 3 రోజుల వ్యవధి లోగా పూర్తి చేయాలన్నారు. యాసంగి పంట సీజన్ లో రైతులు పండించిన నాణ్యమైన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరుగుతుందని, ఎఫ్ఏక్యూ ప్రమాణాలు రాగానే ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలిస్తున్నామన్నారు. మంథని పట్టణ ప్రాంతంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్న ట్రైనింగ్ సెంటర్ పనులు మూడు రోజులలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా సహకార అధికారి శ్రీ మాల, మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్, మంథని తహసిల్దార్ కుమారస్వామి,రామగిరి తహసిల్దార్ సుమన్, ఏడిఎం అంజని, ప్యాక్స్ సీఈఓ అశోక్, ఏపిఎం పద్మ, ఏఈ మౌనిక, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Reporter
Aakanksha News