Tuesday, 28 July 2026 12:36:42 PM

గాంధీ.. గొప్ప ‘పీపుల్స్ ఎకనామిస్ట్’!

-భారత సుదర్శన్, విశ్లేషకులు & సీనియర్ జర్నలిస్ట్ -

Date : 01 October 2024 05:40 PM Views : 689

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : భారత స్వాతంత్రోద్యమ నాయకుడు మహాత్మా గాంధీ కేవలం పోరాట యోధుడే కాదు..గొప్ప ఆర్థికవేత్త అనే విషయం చాలా మందికి తెలియదు. భారత స్వాతంత్ర్య పోరాటంలో దేశం ఆమూలాగ్రంగా పర్యటించిన మహాత్మా గాంధీ దేశ బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి పునాదులు వేయగలిగాడు. దేశంలో పేదరిక తగ్గించేందుకు, ప్రజలకు చేతినిండా పని కల్పించే మార్గాలను అన్వేషించి ఆచరణలో తెచ్చేందుకు గాంధీ ప్రయత్నించాడు. మహాత్మా గాంధీ యొక్క రాజకీయ ఆర్థిక వ్యవస్థ యొక్క మూలాలు మరియు ఔచిత్యం చాలా గొప్పవి. గాంధీ యొక్క ఆర్థిక విధానం గ్రామం లేదా స్వయం సమృద్ధి ఆర్థిక శాస్త్రం ఆధారంగా రూపొందించబడింది. గ్రామాన్ని స్వయం సమృద్దిగా ఆర్థిక యూనిట్ గా మార్చాలనే గాంధీ ఆలోచన నుండి ప్రేరణ పొంది, ఆ మహా నాయకుడి ఆలోచనలను అమలు చేయడానికి ఎంతోమంది ప్రయత్నించారు..ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిజానికి గ్రామ యువకులను మద్యపానం మానేయమని ప్రోత్సహించడం, లాభదాయకమైన ఉపాధిని చేపట్టడం, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం లాంటివన్నీ గాంధీ ఆర్థిక విధానంలో ప్రధానమైనవే. డాక్టర్ షూమేకర్ అనే అర్థికవేత్త గాంధీని గొప్ప ‘పీపుల్స్ ఎకనామిస్ట్’గా అభివర్ణించాడు. భౌతికవాదానికి వ్యతిరేకంగా ఆధ్యాత్మికతతో ఆర్థిక ఆలోచనలు అనుకూలంగా ఉండే ప్రజల ఆర్థికవేత్తగా గాంధీని షూమేకర్ గుర్తించాడు. గాంధేయ ఆర్థిక శాస్త్రాన్ని ‘పీపుల్స్ ఎకనామిక్స్’గా అన్వయించాడు. అభివృద్ది యొక్క ఆర్థిక సాధనాలు ప్రజలపై ఆధారపడి ఉంటాయి. పేదలలు ఎందుకు పేదలుగా ఉన్నారని అడగడం ప్రారంభించాలని, వారి శూన్య ఉత్పాదకతను ఎలా పెంచగలగాలనే ఆలోచన చేయాలని గాంధీ తెలిపారు. గాంధీ ‘జనాల ద్వారా ఉత్పత్తి’ అని పిలుపునిచ్చి, గ్రామాలు మరియు పేద నివాసుల మోక్షం లేకుండా భారతదేశం యొక్క మోక్షం అసాధ్యమని అన్నారు. భారతదేశంలో ధనవంతులు చాలా ధనవంతులు అయ్యారు. పేదల సంఖ్య తీవ్రంగా పెరిగింది. గాంధీ ఇవ్వాటి రోజున జీవించి ఉన్నట్లయితే..దేశంలోని ప్రస్తుత పరిస్థితులను చూసి తీవ్ర వైఫల్యానికి సంకేతంగా భావించేవారేమో. గాంధీ ఆర్థిక శాస్త్రం గురించి మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశంలో పేదరికం మరియు గ్రామీణ జనాభా దృష్ట్యా భారతదేశం సమృద్ధి ఆర్థిక శాస్త్రం మరియు స్కేల్ ఎకనామిక్స్ మధ్య సమతుల్యతను సాధించాల్సిన అవసరం ఉంది. గాంధీ యంత్రాలకు, పరిశ్రమలకు వ్యతిరేకం కాదనే విషయాన్నీ మనం అంగీకరించాలి. ఆనాడే గాంధీ ప్రింటర్ మరియు ప్రింటింగ్ ప్రెస్ లను ఉపయోగించాడు. గాంధీ రైళ్లలోనూ విస్తృతంగా ప్రయాణించారు. ఒక ఆవిరి నౌకను ప్రారంభించడాన్ని గాంధీ ప్రశంసించారు. అహ్మదాబాద్ లోని ఆధునిక మిల్లుల గురించి అతను గర్వపడ్డాడు. గాంధీకి యంత్రాలపై ఉన్న ప్రేమ, ఆసక్తి తదితర విషయాలతో అతని ఆర్థిక విధానం మనకు బోధపడుతుంది. పెట్టుబడిదారీ మరియు శ్రామిక వర్గానికి మధ్య సమతౌల్యాన్ని పునర్వ్యవస్థీకరించడానికి హింసాత్మక విధానాలు సమాజాలను అస్థిరంగా వదిలివేస్తాయని గాంధీ అభిప్రాయపడ్డారు. అవకాశాల సమానత్వం కోసం గాంధీ తన ప్రాధాన్యతను స్పష్టంగా వ్యక్తపరిచాడు. అందరికీ ఒకే సామర్థ్యం లేనందున అసమాన ఫలితాల యొక్క అనివార్యతను గాంధీ అంగీకరించాడు. ఉన్నతమైన తెలివితేటలు ఉన్న వ్యక్తికి ఎక్కువ సంపాదించడానికి అనుమతిస్తానన్నాడు. సమాజ ప్రయోజనాల కోసం సంపన్నులు విశ్వసించే ఆస్తిగా సంపద అనే గాంధీ యొక్క ఆలోచన ఆధునిక పెట్టుబడిదారీ దుష్ప్రవర్తనకు తగిన విరుగుడు అని చెప్పవచ్చు. గ్రామ స్వరాజ్యం అంటే స్వయం సమృద్ధిగా కానీ వికేంద్రీకరించబడిన చిన్న-స్థాయి ఆర్తిక నిర్మాణం మరియు భాగస్వామ్య ప్రజాస్వామ్యంతో కూడిన గ్రామ గణతంత్రాలు.. దాదాపు ఏడు లక్షల గ్రామాలకు పైబడిన భారతదేశంలో సామాజిక, నైతకి మరియు ఆర్థిక స్వేచ్చను సాధించడం. గ్రామాలు నశిస్తే భారతదేశం నశిస్తుంది అన్నారు. కొంతమంది ఆధునిక ఆర్థికవేత్తలు మాత్రం గాంధీ దృష్టిని తిరోగమనం అన్నారు. జాతీయ విముక్తి కోసం పోరాటాన్ని నడిపించడంలో అతని నైపుణ్యాన్ని మెచ్చుకున్న చాలా మంది అతని రాజకీయ నాయకత్వానికి చెల్లించాల్సిన మూల్యంగా అతని అభిప్రాయాలను అయిష్టంగానే సహించినట్లుగా అక్కడక్కడా మనకు అనిపిస్తుంటుంది. అయితే చాలామంది గాంధీ ఆర్థిక అంతర్ దృష్టిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. గాంధీ ఆర్థిక విధానాల్లో వ్యవసాయం మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కుమ్మరులు, నేత కార్మికులు, చెప్పులు కుట్టేవారు, వడ్రంగులు, కమ్మరి మొదలైన వారి కోసం కుటీర పరిశ్రమలు వంటి అన్ని ఉత్పాదక, వ్యవసాయేతర కార్యకలాపాలను పునరుజ్జీవింపజేయడం, ప్రోత్సహించడం లాంటివి ఉన్నాయి. ప్రజల నిజమైన అవసరాల నుండి అన్ని ఆర్థిక తర్కాలను ప్రారంభించి, పేదరికం నుండి బయటపడటానికి పేదలకు సహాయం చేయమని గాంధీ ఆర్థిక విధానం మనకు స్పష్టం చేస్తుంది. అంతేగాకుండా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలసల ధోరణిని తిప్పికొట్టాలని సూచిస్తుంది. పెద్ద నగరాల్లో పెరుగుతున్న జనాభా కేంద్రీకరణను తగ్గించాలనీ చెబుతుంది. వీటన్నింటినీ అనుసరించడం ద్వారా మాత్రమే, భారతదేశం లక్షలాది మందికి ఆహారం, బట్టలు, ఇల్లు మరియు జీవితానికి అవసరమైన కనీస అవసరాలను అందించగలవని గాంధీ ఆర్థిక విధానాలు మనకు స్ఫష్టతనిస్తాయి. గాంధీకి రాజకీయ స్వాతంత్ర్యం నిజమైన స్వాతంత్ర్యం కోసం కేవలం మొదటి మెట్టు’.. సామాజిక, నైతిక మరియు ఆర్థిక స్వాతంత్ర్యమే తన చివరి వీలునామాగా చెప్పుకోవచ్చు. గాంధీ తన జీవితకాలంలో వ్యక్తిగత కోరికలను తగ్గించి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాడాడు. ప్రతి భారతీయుడు భౌతికంగా సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించాలని కోరుకున్నాడు. దానికోసమే తుది శ్వాస వరకూ గాంధీ పోరాడారు. ప్రస్తుత తరుణంలో ప్రపంచీకరణ విసురుతున్న అనేక అర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్థిక వేత్తలు ‘గాంధీ ఆర్థిక విధానాలు’ కొంతమేరకైనా ఆచరణీయంగా ఉండేలా చూడాలి. అప్పుడే ధనిక దేశాలు విసురుతున్న అనేక విషకోరల నుండి ప్రపంచంలోని అనేక పేద దేశాలు, పేద ప్రజలు ఆర్థిక భద్రతతో ఉండగలుగుతారు. వసుధైక కుటుంబానికి నిచ్చెన మెట్లుగా కూడా గాంధీ ఆర్థిక విధానాలు ఉపయోగపడే అవకాశమూ ప్రస్తుతం పుష్కలంగా ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :