ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : అంతర్గాం స్పిన్నింగ్ మిల్లు వెంటనే ప్రారంభించాలని ఏ.ఐ.వై.ఏఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మార్కపురి సూర్య డిమాండ్ చేశారు. ఈ మేరకు అంతర్గాం మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ..భగత్ సింగ్ విప్లవ ఆదర్శంతో 1959 మే 3న అఖిల భారత యువజన సమాఖ్య ఆవిర్భవించిందని అన్నారు. యువజన హక్కుల సాధనలో దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేసి 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించాలని పోరాడిన సంఘం ఏఐవైఎఫ్ అని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన పార్టీలు ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి, గద్దె నెక్కిన అనంతరం యువతను మోసగించడం జరుగుతుందని అన్నారు.కేంద్రంలో ఉన్న NDA సర్కార్ తన మేనిఫెస్టోలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రగల్బాలు పలికి కోటిన్నర ఉద్యోగాలు పోవడానికి కారణంగా నిలిచారని 8 సంవత్సరాల పాలనలో 16కోట్ల ఉద్యోగాలు సృష్టించకపోగా ఉన్న ఉద్యోగాలను పోగొట్టిన దుర్మార్గ పాలన ఎన్డీఏకే దక్కిందని విమర్శించారు. దేశంలో 6.9% నిరుద్యోగశాతం పెరగడానికి కారణం ఎన్డీఏ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలని అన్నారు. దేశంలో ప్రభుత్వ పరిశ్రమలన్నీ అమ్మకానికి పెడుతూ రిజర్వేషన్లు ఎత్తివేస్తూ పేద బడుగు బలహీన వర్గాల యువతను ఉద్యోగాలకు దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మత రాజకీయాలు చేస్తూ సెక్యులర్ భావాలు ఉన్నటువంటి భారతదేశాన్ని మత రాజకీయాలు పులిమి భారతదేశాన్ని అగ్నిగుండంగా మారుస్తున్నారని అన్నారు. ఎంతో మందికి జీవనోపాధి అయిన అంతర్గాం స్పిన్నింగ్ మిల్లు వెంటనే ప్రారంభించాలి అని డిమాండ్ చేశారు. ప్రతీ ఎన్నికల్లో స్పిన్నింగ్ మిల్లు ను రాజకీయంగా వాడుకుంటున్నారు తప్పా స్పిన్నింగ్ మిల్లు బాధితుల పైన ఎలాంటి చిత్త శుద్ది లేదనీ అవేదన వ్యక్తం చేశారు . స్పీన్నింగ్ మిల్లుతో పాటు ఎన్నికల హామీల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశం, రాజు, శ్రీనివాస్, శ్రీకాంత్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు
Admin
Aakanksha News