ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం రాజకీయాల ఉత్కంఠకు తేరపడనుందా... నేడు హైదరాబాదులో మంత్రి కేటీఆర్ తో బీఆర్ఎస్ ఆశావాహుల సమావేశం ఎటువైపు దారి తీస్తుంది. రామగుండం రాజకీయాలు ఏమలుపు తిరుగుతాయో అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు వ్యతిరేకంగా గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ ఆశావాహులు పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, రామగుండం నగర్ పాలక సంస్థ తొలి మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, బసంత్ నగర్ పర్మినెంట్ కార్మిక సంఘం నాయకులు బయ్యపు మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాతిపెల్లి ఎల్లయ్య లు కలిసి రామగుండం నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తున్న విషయం విధితమే.. అయితే ఈ ఐదుగురు ఆశావాహులు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు టికెట్ ఇవ్వవద్దని, ఇస్తే నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలయ్యే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. దీంతోపాటు ఎమ్మెల్యే ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా రామగుండం రాజకీయాలు సంచలనంగా మారడంతో ఆశవాహులతో గతంలోనే మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ లో సమావేశం అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే ఓడిపోతామని, ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారని సమావేశంలో మంత్రి కోప్పుల ఈశ్వర్ కు వివరించినట్లు సమాచారం. దీంతో ఇదే విషయాన్ని మంత్రి అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లడంతో గతంలోనే మంత్రి కేటీఆర్ తో సమావేశం కానుండగా కొన్ని అనివార్య కారణాలతో సమావేశం రద్దు కావడంతో మళ్లీ ఆశవాహులు తమ కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ఏకంగా ఈనెల 6వ తేదీన గోదావరిఖని మార్కండేయ కాలనీలోని బృందావన్ గార్డెన్ లో ప్రజా ఆశీర్వాద సభ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు సైతం వారు మీడియా సమావేశంలో వెల్లడించారు. దీంతో రామగుండం రాజకీయాలు మరోసారి చర్చకు దారి తీసాయి. దీంతో వెంటనే స్పందించి అధిష్టానం ఐదుగురు ఆశావాలతో మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఆశావాహులు ఏ విధంగా స్పందిస్తారు... మంత్రి కేటీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు... అనే ప్రశ్నలకు రామగుండం రాజకీయాలు ఉత్కంఠ గా మారాయి. దీంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరగడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.
Admin
Aakanksha News