ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : రామగుండం కార్పొరేషన్ విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగుండం పురపాలక కార్యాలయంలో కార్పొరేషన్ పనితీరుపై పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు.తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టి.యూ.ఎఫ్.ఐ.డి.సి) నిధుల ద్వారా చేపట్టిన నగరాభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణ, ఆస్తిపన్ను వసూలు, టౌన్ ప్లానింగ్, తదితర అంశాలను కలెక్టర్ అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. నగరంలో టి.యూ.ఎఫ్.ఐ.డి.సి ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, వరద నియంత్రణ పనులకు ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చే వర్షాకాలం నాటికి పూర్తయ్యే విధంగా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.నగరంలో ఉన్న విద్యుత్ స్తంభాలకు సోలార్ ప్యానల్ ద్వారా విద్యుత్ సరఫరా చేసే విధంగా పనులను ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని, ఫిబ్రవరి నుంచి కనీసం 10 సంవత్సరాల వరకు రామగుండం పురపాలక సంస్థకు ఎటువంటి కరెంట్ బిల్లు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నగరంలో కోటి 25 లక్షలతో చేపట్టిన త్రాగునీటి సరఫరా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు.కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు నిర్దేశించుకున్న లక్ష్యంలో 49% ఆస్తి పన్ను వసూలు చేయడం జరిగిందని, రాబోయే మార్చి నాటికి కనీసం 95 శాతం ఆస్తి పన్ను వసూలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పారిశుధ్య నిర్వహణ కోసం నూతనంగా కొనుగోలు చేసిన ఆటోలు, ట్రాక్టర్ లు సోమవారం నుంచి వినియోగించాలని, నగరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, చెత్త సేకరణ సంబంధించి నిర్దేశిత షెడ్యూల్ ఫాలో కావాలని రోడ్లపై ఎక్కడ చెత్త లేకుండా చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్పొరేషన్లు టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, అనుమతి లేకుండా ఎక్కడైనా నిర్మాణాలు జరిగితే వెంటనే తొలగించాలని తెలిపారు.ఈ సమావేశంలో ఈఈ రామణ్, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News