ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : డిమాండ్ల సాధనే ధ్యేయంగా తెలంగాణ బెటాలియన్ పోలీసులు, వారి కుటుంబాలు చేపట్టిన నిరసనలు హైదరాబాద్లో శనివారం కూడా కొనసాగాయి. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో బెటాలియన్ పోలీసుల కుటుంబీకులను పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాలకు తరలిస్తున్నారు. ఈక్రమంలోనే ఓ మహిళను అదుపులోకి తీసుకొని వ్యాన్ ఎక్కించారు. దీంతో ఆమె 'నాకు పాలు తాగే చిన్న బాబు ఉన్నాడు.. వదిలేయండి ప్లీజ్' అని వేడుకున్నారు. అక్కడున్న మీడియా సిబ్బంది కూడా ఆమెను వదిలేయాలని కోరారు. అయినా పోలీసులు వినకుండా ఆమెను వ్యాన్లో తీసుకెళ్లారు. ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానం అమలు చేయాలనే డిమాండ్తో జిల్లాల్లో పోలీస్ బెటాలియన్ భార్యలు ఆందోళనకు దిగారు. అనంతరం వారు సచివాలయ ముట్టడి ప్రయత్నించడం అరెస్టులకి దారితీసింది. ఒకే పోలీస్ విధానాన్ని అమలుచేసి తమ భర్తలకు ఒకే దగ్గర డ్యూటీ చేసే అవకాశం కల్పించాలని వారి భార్యలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ అమలయ్యే వరకు మెస్ తీసివేసి ఒకే దగ్గర 3 నుంచి 5 పోస్టింగ్లు ఇవ్వాలని నినాదాలు చేశారు.ఒకే నోటిఫికేషన్, పరీక్ష ఉన్నప్పుడు అందరికి ఉద్యోగం కూడా ఒకేలా ఉండాలని, కానీ తమ భర్తలను కుటుంబాలకు దూరంగా ఎందుకుంచుతున్నారని ప్రశ్నించారు. "సమయం సందర్భం ఉండదు. ఎప్పుడంటే అంటే అప్పుడు పిలుస్తారుసమయం లేకుండా వెళ్లిపోతారు. డ్యూటీ ఎంత ముఖ్యమో మమ్మల్ని కూడా అంతే చూసుకోవాలి కదా. మా అబ్బాయికి జర్వం వచ్చినా రెండు నెలల వరకు ఇంటికి రాలేదు. ఇలాగైతే కుటుంబంతో కలిసి ఉండేది ఎప్పుడు. గడ్డి తీయిస్తారు, మట్టి, ఇటుకలు మోపిస్తారు ఇవన్నీ చేయడానికి మా భర్తలు పోలీసులా లేక కూలీలా" అని ఓ పోలీస్ బెటాలియన్ భార్య ఆవేదన వ్యక్తం చేసింది. పెద్ద సంఖ్యలో వచ్చిన బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఠాణాలకు తరలించారు.
'పాలు తాగే పిల్లాడున్నాడు.. వదిలేయండి ప్లీజ్'..దిగొచ్చిన సర్కార్..
బెటాలియన్ కానిస్టేబుళ్ల సెలవుల రద్దు నిర్ణయాన్ని రాష్ట్ర పోలీస్ శాఖ తాత్కలికంగా వాయిదా వేసింది. వారి కుటుంబ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వారి కుటుంబ సభ్యులతో చర్చించాలని నిర్ణయించింది.
Admin
Aakanksha News