ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : మాదిగ, మాదిగ ఉప కులాలకు 9 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని మాదిగ, మాదిగ అనుబంధ కులాల ఐక్యవేదిక తెలిపింది. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఆకాంక్షను నెరవేర్చే విధంగా ఎస్సీ వర్గీకరణ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి దామోదర రాజనర్సింహ కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం బషీర్బాగ్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఐక్యవేదిక చైర్మన్ మేడి పాపయ్య మాట్లాడుతూ అన్ని వర్గాల మద్దతుతోనే వర్గీకరణ సాధించుకున్నామని, ఇక ఐక్య పోరాటాలకు నాంది పలుకుదామని పిలుపునిచ్చారు. రాజ్యాధికారంతో పాటు అసైన్డ్, లీడ్ క్యాబ్ భూములు, సబ్ ప్లాన్ ద్వారా స్వాలంబన సాధించి, సమగ్ర అభివృద్ధి వైపు విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాలలో అభివృద్ధి సాధించడానికి ఆలోచనలు చేసి ఆచరణ రూపం దాల్చే విధంగా అడుగులు వేయాలన్నారు. తమ సోదరులు మాల, మాల ఉప కులాలను కలుపుకొని ముందుకు సాగుదామని, ఎస్సీల వర్గీకరణ ఉద్యమం ఏ కులానికి వ్యతిరేక ఉద్యమం కాదన్నారు. ఒక సామాజిక అసమానతలను తగ్గించి రిజర్వేషన్ ఫలాలను సరి సమానంగా పంచుకునే పోరాటంగా మాత్రమే చూడాలని అన్నారు. ఇప్పుడు చేసిన వర్గీకరణలో గ్రూపులలోని కులాలను ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ అని వాదనలు మాని పెద్ద మనసుతో వర్గీకరణను స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు. కా ర్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు కొండేటి మల్లన్న, కోఆర్డినేటర్స్ రాజలింగం, చింత స్వామి ,మేడి రమణ ,ప్రొఫెసర్ మల్లేష్, విజయ్ కుమార్,మేరీ మాదిగ, కృపాకర్, వైస్ చైర్మన్లు కనకరాజు, బైరి వెంకటేశం, మంగేష్ గుర్రాల శ్రీనివాస్,వరలక్ష్మి, పెద్ద ఎత్తున నేతలు పాల్గొన్నారు.
Admin
Aakanksha News