ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఎవరెవరు బెదిరిస్తున్నారో వారి పేర్లను భారాబర్ పింక్ బుక్కులో రాసుకుంటామని, బెదిరింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాన్సువాడలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు వెళ్లొద్దని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్లు చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను బెదిరింపులకు గురి చేస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని వాళ్ళ తాతలు ముత్తాతలు జేజమ్మలు ఎవరు దిగొచ్చినా కూడా ఇక్కడ భయపడే వాళ్లు ఎవరూ లేరని ఎద్దేవా చేశారు.. మాట తప్పడం మడమ తిప్పడమే కాంగ్రెస్ పార్టీ నైజాం అన్నారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారంటీ కార్డులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి పంచి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. గతంలో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అరిగోస పెట్టిందన్నారు. వందలాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలకు కాంగ్రెస్ పార్టీ కారణమని విమర్శించారు. కేవలం ఏడాదిన్నర పాలనలోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూట కట్టకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నోబెల్ బహుమతి ఇవ్వాలని ఎద్దేవ చేశారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు రజతోత్సవ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ గడ్డమీద అగ్గి పెట్టించి రాష్ట్రాన్ని సాధించి, నలిగిపోయిన ఆత్మగౌరవాన్ని రెపరెపలాడించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదే అన్నారు. స్వతంత్ర దేశంలో పోరాటం చేసి లక్ష్యాన్ని చేరిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. వీరులు మాత్రమే లక్ష్యం చేరేవరకు పోరాటం చేస్తారని అది కేసీఆర్ తోనే సాధ్యమైందని అన్నారు. ప్రజాస్వామ్య పంతాను నమ్ముకొని హింసాయుతంగా పోరాటం చేసి తెలంగాణ ఉద్యమం సాధించి త్యాగాలతో తెలంగాణ కోసం మొదటి అడుగు వేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం కేంద్ర మంత్రి పదవిని సైతం గడ్డి పోచల వదిలేసిన ఘనత కేసీఆర్ దే అని అన్నారు. ఎవరో బిక్ష పెడితేనో ఎవరో దయతలిస్తేనో ఇస్తే తెలంగాణ రాలేదని కేసీఆర్ త్యాగం కృషి పోరాట పటిమా ఎంతో మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల వల్ల తెలంగాణ కల సాధ్యమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో కటిక చీకటి వస్తుందని, నక్సలైట్ల రాజ్యం వస్తుందని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కోటీ ఎకరాల మాగానిని తయారు చేస్తున్నామని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు వంటి అనేక పథకాలను కేసీఆర్ అమలు చేసి ఇతర రాష్ట్రాలకు తెలంగాణను ఆదర్శంగా నిలిపారని పేర్కొన్నారు.
Admin
Aakanksha News