ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏలాంటి సదుపాయాలు లేకుండా వరి నాట్లతో దర్శనమిస్తున్నాయని ఇలాంటి ప్రాంగణంలో యువకులు ఎలా సాధన చేస్తారని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మార్కపురి సూర్య ప్రశ్నించారు. అంతర్గాం మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని ఏఐవైఎఫ్ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కపురి సూర్య మాట్లాడుతూ "తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని డబ్బులతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఆరంభ శూరత్వమే తప్ప ఎవరికి ఉపయోగపడే పరిస్థితి లేదని అన్నారు. బ్రాహ్మణపల్లి లో గల క్రీడా ప్రాంగణం వరి నాట్లతో దర్శనం ఇస్తుందని ఇట్లాంటి ప్రాంగణంలో యువకులు కానీ నిరుద్యోగులు కానీ క్రీడలకు సంబంధించిన ఉద్యోగాల కోసం సాధన చేయాలంటే ఇలాంటి ప్రాంగణంలో సాధ్యమయ్యే పరిస్థితి లేదని కనీసం మైదానాన్ని చదును చేసే పరిస్థితి కూడా లేకపోవడం దారుణం అని విమర్శించారు. ప్రతి క్రీడా మైదానంలో ఒక కోకో కోర్టు ,లాంగ్ జంప్ పిట్, వాకింగ్ ట్రాక్ ,ఎక్సర్సైజ్ బార్ సింగిల్ అండ్ డబుల్ తో పాటుగా క్రీడా ప్రాంగణం చుట్టూ చెట్లు నాటి క్రీడా సాధన చేసే ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడే విధంగా క్రీడా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు మైదానంలో వరినట్లు కూడా తీయలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా నామమాత్రంగా క్రీడా ప్రాంగణం బోర్డు పెట్టి ఎలాంటి వసతులు కల్పించకపోవడం మూలంగా రాత్రి వేళల్లో ఇవి అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారేటువంటి పరిస్థితి కూడా ఉందని అన్నారు. పొలంలో క్రీడ ప్రాంగణం బోర్డ్ పెట్టీన సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం మండలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నటువంటి గ్రామ యువకులంతా సాధన చేయడానికి ఎటువంటి ప్రాంగణాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు క్రీడా ప్రాంగణాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని లేని పక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AIYF నాయకులు ఏ.వెంకటేష్, బి. శివ, విశ్వం పాల్గోన్నారు
Admin
Aakanksha News