ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం నియోజకవర్గంలోని పేద ప్రజానీకానికి కార్పొరేట్ వైద్యం అందించడం కోసం ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాల.. రామగుండానికే తలమానికంగా నిలుస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రేషన్ డీలర్లతో ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, దీంతో ప్రతి ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలు ఉండే రేషన్ డీలర్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, అవగాహన కల్పించాలని సూచించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిరుపేదలు ఎక్కువగా ఉన్నారని, అదే విధంగా కాలుష్యం కూడా విపరీతంగా ఉండడంతో ప్రజలకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే మెడికల్ కళాశాల ఏర్పాటుకు ఎంతగానో కృషి చేసి, చివరికి సాధించానన్నారు. కాని కొంతమంది మూర్కపు నాయకులు వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ.. తనపై, తన కృషి పై, తన చిత్తశుద్దిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రామగుండం నియోజకవర్గం ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖమాత్యులు కేటీఆర్ సహకారంతో అభివృద్ధి చెందిందన్నారు. ఇప్పటికైనా వ్యక్తిగత ఆరోపణలు మానుకొని, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలని సూచించారు. కాగా డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీలర్లు ప్రకాష్ రెడ్డి, అంకూస్, నర్సయ్య, ప్రభంజన్ రెడ్డి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News