ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / జగిత్యాల జిల్లా : జగిత్యాల అక్షర చిట్ ఫండ్ ఎదుట బాధితులు ఆందోళన నిర్వహించారు.చిట్ ఫండ్ కు తాళం వేసి నిరసన తెలిపిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిట్ ఫండ్ ఆగడాలు రోజురోజుకు శృతిమించి పోతున్నాయి. కాయకష్టం చేసి పొదుపు చేసుకుని నాలుగు డబ్బులు వేనుకేసుకుంటే భవిష్యత్తులో పనికొస్తాయి అనుకుంటే చిట్ ఫండ్ మోసాలతో బాధితులు లబోదిబోమంటున్నారు.జగిత్యాల పట్టణంలోని అక్షర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వందలాదిమంది చీటీ డబ్బులు జమ చేసుకున్నారు. కొందరు నెల నెల కట్టగా, మరికొందరు అధిక వడ్డీ వస్తుందని లక్షలు డిపాజిట్లు చేశారు. పట్టణానికి చెందిన సుమారు 60 మంది చిట్టి ఎత్తుకుని సుమారుగా ఆరు నెలలు గడిచిన ఇంత వరకు డబ్బులు చెల్లించకుండా రేపు మాపు అంటూ సతాయిస్తూ వస్తున్నారు. ఆలాగే కరోనా సమయంలో డబ్బులు వసూలు కాలేదని... మీరు ఇచ్చిన డబ్బులు రియల్ ఎస్టేట్ పై పెట్టుబడి పెట్టమని ఇస్తామని దాటవేస్తూ వస్తున్నారని చెప్పడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళ తన బిడ్డ పెళ్లి పెట్టుకున్నానని డబ్బులు కావాలని కార్యాలయం చుట్టూ తిరిగిన ఫలితం లేక పోవడంతో రోదిస్తూ వెనుదిరిగింది. మంగళవారం పలువురు బాధితులు అక్షర చిట్ ఫండ్ కార్యాలయానికి తరలివచ్చి మేనేజర్ తో వాగ్వాదానికి దిగారు. ఎంత చెప్పినా ఇప్పుడు చెల్లించలేమని మేనేజర్ తేల్చి చెప్పడంతో విసుకు చెందిన బాధితులు ఉద్యోగులను కార్యాలయంలోఉంచి బయటకు పంపి తాళం వేసి నిరసన తెలిపారు. అవసరాల కోసం డబ్బులు చిట్ ఫండ్ లో జమ చేసుకుంటే సమయానికి డబ్బులు ఇవ్వక ఇబ్బందుల గురి చేస్తున్నారని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
Admin
Aakanksha News