ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో పాటు RFCL దళారులు మోహన్ గౌడ్, గుండు రాజుల ఆస్తుల జఫ్తు చేయాలనీ పౌర హక్కుల సంఘం ప్రొఫెసర్. అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రమేయం లేకుండానే దళారులు RFCL లో ఉద్యోగాల చేపట్టారా అని ప్రశ్నించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో జరిగిన ఉద్యోగాల దందాపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి వారి ఆస్తులు జఫ్తు చేసి RFCL బాధితుల అందరికి ఒకే సారి డబ్బులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.అంతే కాకుండా ఈ ఉద్యోగాల దందా పై సీబీసీఐడి తో విచారణ జరిపి ఇందులో పాత్ర ఉన్న RFCL అధికారులతో పాటు ఎమ్మెల్యే, కోరుకంటి చందర్ దళారులపై చర్యలు తీసుకోవాలన్నారు. అంతే కాకుండా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో పాటు RFCL దళారీలపై హత్య నేరం కింద కేసులు నమోదు చేయాలని వారన్నారు. కేవలం ఎమ్మెల్యేను కాపాడుకోవడానికే అఖిలపక్ష కమిటీ ని ఏర్పాటు చేశారని విమర్శించారు. వీరి బాధ్యత రాహిత్యం, నిర్లక్ష్యంతోనే బాధితులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ ఉద్యోగాల కుంభకోణంపై 2021 నవంబర్ 24వ తేదీన కార్మిక సంఘం సిబిఐ ఒరిజినల్ కమిషనర్ హైదరాబాద్ కు ఫిర్యాదు చేస్తే వచ్చిన నివేదికను ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన బాధితులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఒకేసారి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆత్మహత్యకు పాల్పడిన ముంజ హరీష్ రాకేష్ రెడ్డి కుటుంబ సభ్యులకు కోటి రూపాయల నష్టపరిహారం తో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన శ్రీనివాస్, శ్రావణ్, శేఖర్ లకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.Rfcl లో ఉద్యమం చేస్తున్న కార్మిక సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వారు మండిపడ్డారు. నవంబర్ 14న rfcl ను జాతికి అంకితం చేయడానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ తమ కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా సిబిఐ నివేదికపై స్పందించి పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు రాజగోపాల్, దళిత లిబ్రేషన్ ఫ్రంట్ నాయకులు మార్వాడి సుదర్శన్, మదన కుమారస్వామి, పర్వతాలు రాజ పోషం, వినోద్, రవి, రాజలింగం, రాయమల్లు, సుచరిత, కొమరన్న, మల్లేశం, విరసం రాజన్న తదితరులు పాల్గొన్నారు
Admin
Aakanksha News