ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఎవరికీ దండం పెట్టే అక్కర్లేకుండా.. ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా రైతుల ఖాతాల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా నిధులు జమ చేశారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజు చేయాలని, వ్యవసాయాన్నిఅన్ని విధాలుగా అభివృద్ధి పరచాలని ఎవరూ ఆలోచించని విధంగా విప్లవాత్మకమైన పథకానికి కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు. రైతుల మీద ప్రేమ ఉండే నాయకుడు కాబట్టి.. కేసీఆర్ రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఆలోచన చేసి దాన్ని అమలు చేశారని తెలిపారు.ఒకసారి కాదు.. వరుసగా 11 సీజన్లకు నేరుగా వారి ఖాతాల్లో రూ. 73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశారని పేర్కొన్నారు. కేసీఆర్ 12వ సీజన్ వేసేందుకు పైసలు జమ చేశారని దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఉత్తరం రాసి ఆపారని కేటీఆర్ గుర్తు చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాది దాటిపోయినా రైతుబంధు రూపంలో రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదని 12వ సీజన్ కింద రూ. 7500 కోట్లు మేమే వేసేటోళ్లం. మేం దాచిపెట్టిన రూ. 7500 కోట్లను వాళ్లు రైతుల ఖాతాల్లో వేశారని అన్నారు.కొత్తగా ఇవ్వకపోగా.. వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్ ఇచ్చారు. రైతులను రాజులను చేస్తాం అని రాహుల్ గాంధీ చేత ఉపన్యాసాలు ఇప్పించారన్నారు.కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామన్నారు. ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ, బోనస్ రూ. 500, రైతు కూలీలకు రూ. 12 వేలు ఇస్తామన్నారు. ఇది రైతు డిక్లరేషన్ వాగ్దానాలు అని కేటీఆర్ గుర్తు చేశారు.
Admin
Aakanksha News