ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్ పరిధిలో కలిగిన కార్పొరేటర్ల తీరుతో అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓవైపు రామగుండంలో అభివృద్ధి ఏమీ లేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే మరోవైపు అధికార పార్టీలో కార్పొరేటర్ల తీరు ఆసక్తిని కలిగిస్తుంది. అయితే గత కొన్ని రోజుల క్రితం కార్పొరేటర్లు సమావేశమై తమ వినతులపై ఎమ్మెల్యేకు లేఖ రాయడం రామగుండం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అయితే రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 25 మంది కార్పొరేటర్లు తమకు ఒక్కొక్క కార్పొరేటర్ కు ఆరు దళిత బందులతో పాటు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొంటూ రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ కు 25 మంది కార్పొరేటర్లు వినతి పత్రంతో కూడిన లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది. అయితే ఇప్పటివరకు తమ డిమాండ్ కు ఎమ్మెల్యే స్పందించడం లేదని కొందరు కార్పొరేటర్లు అలిగినట్లు సమాచారం. దీంతో రామగుండం కార్పొరేషన్ లో జరుగుతున్న రాజకీయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే సందేహాలు నెలకొంటుండగా ఇప్పటికే కార్పొరేటర్లను బుజ్జగిస్తున్నట్లు విశ్వాసనీయ వర్గాల సమాచారం.
Admin
Aakanksha News