ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : గంజాయి విక్రయిస్తున్నారనే పక్క సమాచారం అందడంతో నిందితులను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎస్ఐకి తీవ్ర గాయాలైన సంఘటన హైదరాబాద్ లోని హబీబ్ నగర్ లో చోటు చేసుకుంది.ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి అమ్మకాలకు సంబంధించి పక్కా సమాచారం అందడంతో నార్కోటిక్ అధికారులతో కలసి సీఐలు దీపక్, రాజశేఖర్, ఎస్ఐ శివకుమార్ తో పాటు కొంత మంది కానిస్టేబుళ్లు హబీబ్ నగర్ లోని మాంగర్ బస్తీకి వెళ్లారు. అయితే వీరి రాకను గుర్తించిన పాత నేరస్తుడు, గంజాయి వ్యాపారి కంబ్లీ దీపక్ పరారయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులు వెంటపడి దీపక్ ను పట్టుకున్నారు. స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేస్తుండగా స్థానికులతో కలిసి దీపక్ తమ్ముడు అరుణ్ పోలీసులను అడ్డుకున్నాడు. దాదాపు వంద మంది పోలీసులపై దాడికి దిగారు. బీర్ బాటిల్ తో కొట్టడంతో ఎస్ఐ శివకుమార్ తలపై గాయాలయ్యాయి. స్థానికుల దాడి నుంచి తప్పించుకున్న పోలీసులు.. ఎస్ఐ శివకుమార్ ను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనలో ఎస్ఐ మెడలోని రెండు తులాల బంగారు గొలుసు పోయిందని పోలీసులు తెలిపారు. గంజాయి వ్యాపారి కంబ్లీ దీపక్, అతడి తమ్ముడు పరారయ్యారని తెలిపారు.
Admin
Aakanksha News