Friday, 12 June 2026 01:33:19 AM

ధర్మపురి ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మార్గం సుగమం..

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

Date : 31 March 2023 02:28 PM Views : 545

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / కరీంనగర్ జిల్లా : రూ. 13కోట్ల నిధులతో స్థల సన్నద్దతకు (లెవెలింగ్) పనులకు భూమి పూజ కార్యక్రమంను తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమి పూజను నిర్వహించారు. ఏటా 8 కోట్ల లీటర్ల సామర్థ్య ఇథనాల్‌ పరిశ్రమ శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్‌ మండలంలోని స్థంభంపెల్లి గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ భూమిలో వంద ఎకరాల స్థలాన్ని ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. ఏటా 8 కోట్ల లీటర్ల సామర్థ్యం కలిగిన ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు 13 కోట్ల నిధులతో సన్నద్ధత (లెవెలింగ్) పనులకు శ్రీకారం చుట్టారు.ప్రఖ్యాత క్రిభ్‌కో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని సంకల్పించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇథనాల్‌ పరిశ్రమను ధర్మపురి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయాలని గత ఏడాది నవంబర్‌ మాసంలో ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ నేపథ్యంలో గోదావరి నది సమీపంలోని వెల్గటూర్‌ మండల పరిధిలో పరిశ్రమ ఏర్పాటుకు అనుగుణంగా ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులు పరిశీలించడం జరిగిందన్నారు. కాగా ఇథనాల్‌ పరిశ్రమను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన, వంద ఎకరాల స్థలంలో కొంత మేర ఉన్న గట్టు ప్రాంతాన్ని చదును చేసి, ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్థలాన్ని సన్నద్దం చేయాలని ప్రభుత్వం సంకల్పించి స్థలం చదును చేయడానికి, రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్థల సన్నద్దత కోసం రూ. 13 కోట్లను కేటాయించాలన్నారు. నిర్ణీత స్థలంలోని గుట్టబోరు ప్రాంతాన్ని చదును చేయడానికి భూమి పూజ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల జిల్లా రైతాంగానికి అండగా నిలువడంతో పాటు వేలాది మంది నిరుద్యోగ యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పనతో ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలు అత్యధికంగా ఉన్న ధర్మపురి ప్రాంతంలో పెద్ద ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.వ్యవసాయ రంగంలో గొప్పగా పేరుగాంచిన జగిత్యాల జిల్లాలో పెద్ద ఫ్యాక్టరీలు లేవు. జగిత్యాల ప్రాంతంలో వ్యవసాయాధారితమైన భారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన నేపథ్యంలో పుష్కలమైన నీటి వసతి, వరి, మక్క పంట పండే పరిస్థితులు ఉన్న ధర్మపురి ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చే‌యడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ క్రిభ్‌కో సంస్థ ముందుకు రావడంతో పరిశ్రమ ఏర్పాటుకు అంగీకరించారు. ఈ మేరకు పరిశ్రమకు రూ. 700ల కోట్లు నిధులు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని మంత్రి గుర్తు చేశారు ధర్మపురి నియోజకవర్గ పరిధిలో క్రిభ్‌కో సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించనున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీ వల్ల జగిత్యాల జిల్లా సాంకేతిక రంగ స్వరూపమే మారిపోనుంది. ఇథనాల్‌ ఫ్యాక్టరీ ద్వార ప్రత్యక్షంగాను, పరోక్షంగాను జగిత్యాల జిల్లా వాసులైన యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడుతుందని మంత్రి అన్నారు.త్వరలోనే ఇథనాల్‌ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని మంత్రి తెలిపారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :