ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నాగర్కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో శుక్రవారం గ్రామ పంచాయితీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారించాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. మల్లేష్ హాజరై మాట్లాడుతూ.. ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయితీ కార్మికుల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసారు. గత ప్రభుత్వంలో కార్మికుల న్యాయమైన డిమాండ్ ల పరిష్కారం కావాలని 34 రోజులు సమ్మె చేసిన ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామా పంచాయితీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న ఇంత వరకు పెండింగ్ లో ఉన్న బకాయిల జీతాలు చెల్లించ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినెల జీతాలు రాక గ్రామ పంచాయితీ కార్మికులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని వెంటనే పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పీఎఫ్ ,ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలన్నారు. ఈ సందర్బంగా పంచాయితీ కార్మికుల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్మికుల యూనియన్ అచ్చంపేట మండల అధ్యక్షులు జి వేమయ్య, బల్మూరు మండలం అధ్యక్షులు నిరంజన్ వైస్ ప్రెసిడెంట్ కొండయ్య కార్మికులు వెంకట్ రాములు సత్యనారాయణ స్కైలాబ్, బాలస్వామి పద్మ అంకమ్మ, యశోద, ఈశ్వరయ్య, రాంబాబు, మహేష్, తదితరులు పాల్గొన్నారు .
Admin
Aakanksha News