ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : చిల్లర రాజకీయాల కంటే ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలకు పోలీసులపై నమ్మకాన్ని పెంచాలని, వేగవంతమైన న్యాయాన్ని అందించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులను వాడుకోకుండా ప్రజల భద్రత కోసం లా అండ్ ఆర్డర్ సంరక్షణ కోసం పోలీసు శాఖను వాడితే బాగుంటుందని హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గించడానికి మెరుగైన లా అండ్ అర్డర్ నిర్వహించేందుకు ప్రభుత్వం సకాలంలో పోలీసు శాఖకు బడ్జెట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు శాఖను బలోపేతం చేయాలని సూచించారు. . అంతేకానీ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ఉపయోగించుకోకూడదని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజా భద్రత పూర్తిగా దిగజారిందని తెలిపారు. హోం శాఖను నిర్వహిస్తున్న సీఎం రేవంత్రెడ్డి పాలనా వైఫల్యం వల్ల తెలంగాణ పోలీసులకు ఉన్న మంచి నైపుణ్యాన్ని, శక్తిని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడానికి సీఎం రేవంత్ రెడ్డే కారణమని చెప్పారు. ప్రజా భద్రత గురించి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు, రాజకీయ దాడులకు పాల్పడటం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారని, సోషల్మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తే వేధింపులకు గురిచేస్తారని, ఆఖరికి పేరు మరిచిపోతే కూడా కేసులు పెట్టి వేధిస్తారని విమర్శించారు.
Admin
Aakanksha News