ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మహబూబ్నగర్ జిల్లా : ఇది ప్రజా పాలన కాదని... విద్యార్థుల వ్యతిరేఖ పాలన అని. వేలాది మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఎస్.ఎఫ్.ఐ మానుకోట జిల్లా కో కన్వీనర్ గుగులోతు సూర్య ప్రకాష్ తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు. మంగళవారం విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గత నెల రోజులుగా పెండింగ్ లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్ లను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి ప్రజా పాలన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ప్రజా వ్యతిరేఖ పాలనను ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆరోపించారు. ఇప్పటికే విద్యార్థులకు సంబంధించి 8వేల200 కోట్ల రూపాయల స్కాలర్షిప్ లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వెంటనే ప్రభుత్వం విద్యార్థుల సమస్యను పరిష్కరించకపోతే డిసెంబర్ 9వ తేదీన సంవత్సరం పూర్తి చేసుకున్న ఉత్సవాలు మీరు ఏ విధంగా జరుపుకుంటారో అదే విధంగా ప్రభుత్వానికి సంవత్సరికం జరుపుతామని హెచ్చరించారు. మానుకోట జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ, బిసి మైనార్టీ వర్గాలకు సంబంధించి అత్యధిక మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే మనుకోట జిల్లా కేంద్రంలో పక్కనే ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల శిథిలా వ్యవస్థకు చేరి వాన వస్తే వరద, గాలొస్తే గోరిక అన్నట్లు తయారైందని మండిపడ్డారు. ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలను పరిష్కరించి సకాలంలో విద్యార్థుల స్కాలర్షిప్ లను విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.
Admin
Aakanksha News