ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గోదావరి నడి ఒడ్డున చెత్త గుట్టల్లగా ఏర్పడి ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ మేరకు మంగళ వారం ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ బృందం తనిఖీ చేసారు. ఈ సందర్బంగా మద్దెల దినేష్ మాట్లాడుతూ.. రామగుండం నగరపాలక సంస్థలోని 50 డివిజన్ లలో సుమారు 3 లక్షల నుండి 4 లక్షల వరకు జనాభా ఉన్నప్పటికీ 93 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన నగరపాలక సంస్థలో రోజుకు 115 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతుందన్నారు. అయితే నగరంలోని చెత్తను గోదావరినది ఒడ్డున తీసుకెళ్లి డంపింగ్ చేస్తున్నారని దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు, ఎదుర్కొంటూ, అనారోగ్యానికి గురవుతున్నరని ఆవేదన చేస్తూ కార్పొరేషన్ అధికారుల తీరుపై మద్దెల దినేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ప్రాంతంలో చెత్త పోసేందుకు డంపింగ్ యార్డ్ కూడా రామగుండం నగరపాలక సంస్థలో లేక పోవడం విడ్డూరంగా ఉందని, తాత్కాలికంగా గోదావరి నది ఒడ్డున చెత్తను డంపు చేస్తున్నారన్నారు. దాని వల్ల ఆ ప్రాంతమంతా పూర్తిగా అపరిశుభ్రంగా మారిందన్నారు. గోదావరి నది ఒడ్డున పోస్తున్న చెత్త మొత్తం అక్కడే కాలుస్తుండడంతో కాలుష్యం పెరిగి పొగ, దుర్వాసనతో, విషవాయువులు బయటకు రావడంతో ప్రజలు ప్రాణాలకు ప్రమాదం జరుగుతుందన్నారు. అదే విధంగా భారీ వర్షాలు వరదలు వచ్చినప్పుడు చెత్త మొత్తం గోదావరిలో కలిసి నీరు మరింత కలుషితం అవుతుందన్నారు.చెత్త డంపింగ్ యార్డ్ కోసం ప్రభుత్వ రంగ సంస్థల చేతుల్లో వేల ఎకరాల భూమి ఉన్న కనీసం పది ఎకరాల భూమి కూడా ఇచ్చేందుకు సింగరేణితో సహా ఇతర సంస్థలు ఏవి కూడా ముందుకు రాకపోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఉన్న పరిస్థితుల్లో రామగుండం నగరపాలక సంస్థలో బయోమైనింగ్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. బయోమైనింగ్ సాంకేతికను ఉపయోగించి విశాలమైన డంపింగ్ యార్డ్ కోసం సర్వే చేసి ఈ ప్రాంత శివారులో ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. వివిధ రకాల చెత్తా చెదారాలను వ్యర్ధాలను ప్రత్యేకంగా వేరు చేసేందుకు భారీ యంత్రాలు బాయో మైనింగ్ ద్వారా ఉపయోగపడుతుందన్నారు. ఆధునిక సాంకేతికతో పేరుకు పోయిన వ్యర్థాలను శుద్ధి చేయడంతో పాటు ప్రతిరోజు ఉత్పన్నమయ్యే ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేయడం ద్వారా బయోమైనింగ్ కీలకమని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం,రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ఖాళీ స్థలాన్ని చెత్త కోసం డంప్ యార్డ్ కొరకు పరిశీలించి నగర శివారులో బయో మైనింగ్ విధానం అమలు పరచాలని ఎఫ్.ఎఫ్.బి.ఎస్ నేత దినేష్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు రేనికుంట్ల నరేంద్ర, బూడిద హర్ష, హనుమండ్ల వెంకటేష్, అనిల్, భారత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News