ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం రీజియన్ లో వివిధ ఓ.బిలలో పనిచేస్తున్న కార్మికుల జనరల్ బాడీ సమావేశం శనివారం గోదావరిఖనిలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో శాతవాహన మల్టిపుల్ మోటార్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కౌశిక హరి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో TBGKS, CITU, IFTU ల నుండి కేంగర్ల మల్లయ్య, వేల్పుల కుమారస్వామి, తోకల రమేష్ లు పాల్గొని మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా రామగుండం రీజియన్ లో వేలాదిమంది కాంట్రాక్టు కార్మికులు డ్రైవర్లు, హెల్పర్లు, బ్లాస్టింగ్ విభాగాల్లో పనులు చేస్తున్నారని వీరికి చట్టప్రకారం రావాల్సిన వేతనాలు,ఇతర హక్కులు ఓ.బి.యజమానులు ఇవ్వడం లేదన్నారు.పైగా పనిబారాలు మోపి ప్రమాదాలకు కారణం అవుతున్నారని పేర్కొన్నారు. యాజమాన్యం చేస్తున్న నిర్లక్ష్యం వల్ల కాంట్రాక్టు కార్మికులు వారి కుటుంబాలు నష్టపోతున్నారని అన్నారు. కొలిండియా జీతాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇవ్వకపోవడంతో పాటు బోనస్ కూడా ఇవ్వడం లేదని అన్నారు. వేతనాలు పెంచాలని,మిగతా పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే 2 సార్లు యాజమాన్యానికి నోటీసులు ఇచ్చామని అయినప్పటికి యాజమాన్యం దున్నపోతు మీద వర్షం పడినవిదంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఇన్ని జరుగుతున్నా సమస్యలు పరిష్కరించాల్సిన సింగరేణి యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని వారు మండి పడ్డారు.సింగరేణికి లాభాలు రావడానికి కీలక పాత్ర పోషిస్తున్న ఓ.బి.కాంట్రాక్టు కార్మికుల పట్ల యాజమాన్యాలు సవతి తల్లి పాత్ర పోషిస్తుందని అన్నారు. ఫిబ్రవరి 13 నుండి 15 వరకు అన్ని ఓ.బి.లల్లో కాంట్రాక్టు కార్మిక సంఘాల జె.ఏ.సి. ఆధ్వర్యంలో గేటు మీటింగ్ లు నిర్వహిస్తామని అన్నారు. అయినప్పటికి యాజమాన్యం దిగివచ్చి వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని అన్నారు. లేదంటే ఫిబ్రవరి 20 వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని యాజమాన్యాలకు హెచ్చరిక చేశారు.ఈ సమావేశంలో ముస్తాల గ్రామ సర్పంచి రామగిరి లావణ్య నాగరాజు,రామన్న,శశి కుమార్,రవి,నవీన్ లతోపాటు పి.సి.పటేల్,అర్.వి.అర్, సుశి ఓ.బి. కంపెనీల కార్మికులు ఎం.డి.సిరాజోద్దీన్,తోట రమేష్,అనవేన భాస్కర్, శ్రీను, లవ కుమార్,రవి,వేల్పుల రాజు,సంతు,బషీర్ లతో పాటు అధికసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News